Hyderabadi Student Dead : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్ డెడ్ బాడీ పోలీసులకు లభ్యమైంది. తమ కుమారుడిని అమెరికాలోని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, అతడిని కాపాడాలని వేడుకుంటూ గత నెలలో అబ్దుల్ మహ్మద్ అరాఫత్ తల్లిదండ్రులు ఓ వీడియోను విడుదల చేశారు. తమ కుమారుడు ఇక లేడని తెలియడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది.అరాఫత్ తల్లిదండ్రుల రిక్వెస్టు తీసుకున్నాక.. అరాఫత్ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు కిడ్నాప్ అయిన మూడు వారాల తర్వాత అరాఫత్ డెడ్ బాడీ లభ్యమైంది. ఈవివరాలను న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అరాఫత్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ భారత ఎంబసీ ఒక సంతాప సందేశాన్ని విడుదల చేసింది. విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్కు పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
అబ్దుల్ మహ్మద్ అరాఫత్(Hyderabadi Student Dead) వయసు 25 ఏళ్లు. ఇతడు హైదరాబాద్ నాచారంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు. అరాఫత్ ఉన్నత విద్య కోసం 2023 మేలో అమెరికాకు వెళ్లి ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరాడు. నిత్యం అమెరికా నుంచి ఫోన్ చేసి ఇంట్లో వారితో మాట్లాడే అరాఫత్.. చివరిసారిగా మార్చి నెల 7న తండ్రితో మాట్లాడాడు. ఆ తర్వాత మళ్లీ కాల్ చేయలేదు. ఆ మరుసటిరోజే అబ్దుల్ మిస్ అయ్యాడంటూ అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. దీన్ని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్కు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు మార్చి 9న ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8న క్లీవ్లాండ్లోని వాల్మార్ట్ స్టోర్లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఎంత సెర్చ్ చేసినా.. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనేది గుర్తించలేకపోయారు. ఈనేపథ్యంలో అరాఫత్ తండ్రి మార్చి 18న మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.
మరోవైపు అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ఫోన్కాల్ వచ్చింది. అబ్దుల్ను తాము కిడ్నాప్ చేశామని..అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. అరగంట లోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.దీంతో అరాఫత్ తల్లిదండ్రులు ఇంకోసారి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆ పేరెంట్స్కు చివరకు కన్నీళ్లే మిగిలాయి.