హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం సరికొత్త రూల్స్ను ప్రవేశపెట్టనుంది. అదేనండోయ్ కొత్త రూల్స్ను అమలు చేస్తోంది. ఈ నెల అంటే అక్టోబర్ 3 నుంచే ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రోడ్లపై మీరెలా వాహనాలను నడిపినా పర్లేదు కానీ ఇకపై ట్రాఫిక్ పోలీసులకు, నిఘా కెమెరాలకు చిక్కితే మాత్రం ఎలాంటి కనికరం ఉండబోదని అన్నారు. కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా, ఫుట్పాత్, పాదాచారులపై కూడా ఈ రూల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్లైన్ దాటితే రూ. 100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1000 జరిమానా, ఫుట్పాత్లను దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా వేయనున్నారు. నో పార్కింగ్ ప్లేస్లో వెహికిల్స్ పార్క్ చేస్తే, టోవింగ్ వెహికిల్ ద్వారా పీఎస్లకి ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లనున్నారు.
బైక్ నో పార్కింగ్ ఫైన్ 100 రూపాయలతో పాటు, అదనంగా టోవింగ్ చార్జీ 200 వసూలు చేయనున్నారు. కారు నో పార్కింగ్ ఫైన్ 200 రూపాయలతో పాటు, అదనంగా టోవింగ్ చార్జీ 600 వసూలు చేయనున్నారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ. 600 జరిమానా, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలు అక్టోబర్ 3 నుంచి అంటే సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలుకానున్నాయి.