Hyderabad Student : అమెరికాలో పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయి. అక్కడి భారతీయులకు సేఫ్టీ లేకుండా పోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. కోకొల్లలుగా గత కొన్ని నెలల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. వాటిని మరువకముందే తాజాగా మరో తెలుగు విద్యార్థి అమెరికాలో కిడ్నాప్కు అయ్యాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహ్మద్ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. అయితే గత రెండు వారాలుగా ఆ స్టూడెంట్ కనిపించడం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్లోని అబ్దుల్ మహ్మద్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇస్తే విడిచిపెడతామని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. లేదంటే అబ్దుల్ కిడ్నీని అమ్మేస్తామని బెదిరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అబ్దుల్ మహ్మద్(Hyderabad Student) అమెరికాలోని ఓహియో స్టేట్లో ఉన్న క్లేవ్ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్మర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కోర్సు చేస్తున్నాడు. ఈనెల 7 నుంచి అతడి ఆచూకీ కనిపించడం లేదు. ఈవిషయాన్ని అబ్దుల్ తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. దీనిపై అమెరికాలోని అబ్దుల్ బంధువులు క్లేవ్ ల్యాండ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అబ్దుల్ ఆచూకీ కనిపెట్టడంలో సహకరించాలని కోరుతూ బాధితుడి కుటుంబం ఈనెల 18న చికాగోలోని భారత కాన్సులేట్ అధికారులకు ఒక లేఖ రాశారు.
‘‘నాకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లక్ష రూపాయలు ఇస్తే మా అబ్బాయి అబ్దుల్ను విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. లేదంటే మా కొడుకు కిడ్నీని అమ్మేస్తారట. దీనిపై మేం పోలీసులకు సమాచారం అందించాం’’ అని అబ్దుల్ తండ్రి అహ్మద్ సలీమ్ వివరించారు. అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం గత 3 నెలల వ్యవధిలో తొమ్మిదోసారి. బోస్టన్లోని ఇంజినీరింగ్ విద్యార్థి అభిజిత్ పరుచూరు అదృశ్యమైన తరువాత అతడి మృతదేహం ఓ కారులో లభ్యమైంది. ఇప్పుడు అబ్దుల్ను కిడ్నాప్ చేయడం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.