జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు ప్లాన్ చేసినట్లు వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ కుట్రపై సంచలన ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించలేదని పోలీసులు ప్రకటించారు. రెక్కీ కానీ…దాడికి కుట్ర కానీ జరగలేదని పోలీసులు తేల్చేశారు.
సోమవారం పవన్ ఇంటి ముందు కారు ఆపిన ముగ్గురు యువకులు… కారు తీయమని అడిగిన సిబ్బందితో గొడవకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉండటంతో గొడపడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు యువకులు కూడా మద్యం మత్తులోనే గొడవపడ్డట్లు అంగీకరించారు. దీంతో ఆ యువకులను విచారించిన పోలీసులు నోటిసులిచ్చారు. అక్కడ జరిగిందంతా తాగుబోతుల వీరంగం తప్పా పవన్ హత్యకు సంబంధించిన రెక్కీ కాదని తేల్చారు.