High-speed internet for every home : తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి ఇంటికీ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని తక్కువ ధరలోనే ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవల సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన 8వ రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా టెలికాం, బ్రాడ్బ్యాండ్ మౌలిక వసతుల అభివృద్ధి పురోగతిని ఇందులో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు. ఇందులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టవర్ల ఏర్పాటు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసే పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రెండు వారాల్లోగా జిల్లా స్థాయి టెలికాం కమిటీ సమావేశాలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రైట్ ఆఫ్ వే అనుమతుల మంజూరులో జాప్యాన్ని తగ్గించడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పైప్లైన్లు, రోడ్లు, డ్రైనేజీలు పనుల సమయంలో భూగర్భ టెలికాం మౌలిక వసతులు ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ యాప్ను పూర్తి స్థాయిలో సమర్థంగా వినియోగించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, టెలికాం మౌలిక వసతులకు వేగంగా అనుమతులు లభించేలా ప్రక్రియలను మరింత సులభతరం చేయాలని అని నిపుణులు నిర్ణయించారు.
కాగా, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చౌకగా, విశ్వసనీయమైన హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించాలనే ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాన్ని డిజిటల్ యుగంలో అగ్రగామిగా నిలపనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది కేవలం సాంకేతిక అనుసంధానం మాత్రమే కాదని.. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక సామాజిక విప్లవంగా మారుతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల మారుమూల గ్రామాల ప్రజలు సైతం ప్రపంచంతో పోటీ పడే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రైతులకు వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు నేరుగా చేరడమే కాకుండా, టెలిమెడిసిన్ ద్వారా నగరాల్లోని నిపుణులైన వైద్యుల సలహాలను పల్లె నుండే పొందే వీలుంటుందని అంటున్నారు.
గ్రామీణ విద్యార్థులకు ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ ఒక జ్ఞాన గనిగా మారుతుందని చెబుతున్నారు. భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచస్థాయి విద్యా వనరులు, ఆన్లైన్ కోర్సులు, పోటీ పరీక్షల కోచింగ్ వారి గడప వద్దకే చేరుతాయని.. ఫలితంగా పట్టణ, గ్రామీణ విద్యార్థుల మధ్య ఉన్న డిజిటల్ అంతరం తొలగిపోయి గ్రామీణ యువత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఉపాధి రంగంలో దూసుకుపోయేందుకు ఈ కనెక్టివిటీ ఒక బలమైన వారధిగా నిలుస్తుందని అంటున్నారు.
