మరికొద్దిరోజుల్లోవాడవాడలా వినాయకచవితి(Vinayaka Chavithi) సంబరాలు ప్రారంభం కానున్నాయి. గణేష్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించే నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. వీధికొక మంటపం ఏర్పాటు చేసి.. పోటాపోటీగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాల సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు.
ఆఖరిరోజున నగరం నలుమూలల్లోని విగ్రహాలను హుస్సేన్ సాగర్(Hussain Sagar) లో నిమజ్జనం(Ganesh Nimajjanam) చేసేందుకు తరలివస్తారు. వేలాది విగ్రహాలను ఒకేసారి చూసేందుకు రెండుకళ్లూ చాలవు. అంత శోభాయమానంగా జరుగుతుంది వినాయక నిమజ్జనం. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు గతేడాదే ఉత్తర్వులు జారీ చేసింది. అవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయరాదని పెట్టిన నిషేధాన్ని ఏత్తివేయాలని కోరుతూ తయారీ దారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలం నిబంధనలను కొట్టివేయాలని ఈ పిటిషన్ లో కోరగా న్యాయవాది వేణుమాధవ్ గతేడాది పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అందుకు తగిన ఆధారాలను సేకరించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషన్ వేస్తే తగు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్ పై తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.
Also Read : Vinayaka Chavithi Date : ‘వినాయక చవితి’ ఈ నెల 18, 19 తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలి ?