డ్రగ్స్ కేసులో హీరో నవదీప్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నవదీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవదీప్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగింది. వచ్చే మంగళవారం వరకు నవదీప్పై తదుపరి చర్యలు తీసుకోవద్ధంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డిపిఎస్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో నవదీప్పై కేసు నమోదైంది. మీడియా కథనాల ద్వారా నవదీప్ డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చిందని తెలుసుకున్నాడని అతని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ మీడియాలో వచ్చిన కథనాలలో నవదీప్ పేరు, ఫొటోలు ప్రముఖంగా కనిపిస్తున్నాయని న్యాయవాది తెలిపారు. నవదీప్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ పోలీసులు అతడిని పరారీలో ఉన్నారని తప్పుగా చిత్రీకరించారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అభియోగాలలో నవదీప్ నిర్దోషి అని.. అన్యాయంగా నవదీప్ని ఈ కేసులో ఇరికించారని ఆయన తరుపు న్యాయవాది వాదించారు. పిటిషనర్పై నిర్దిష్ట ఆరోపణలు లేవని, ఆరోపించిన నేరంతో అతనికి సంబంధం లేదని కూడా న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో మాజీ ఎంపీ దేవరకొండ విఠల్రావు కుమారుడు దేవరకొండ సురేష్..దర్శకుడు సహా 8 మందిని తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులు గురువారం అరెస్టు చేయగా, వారి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 24 ఎక్స్టసీ మాత్రలు, 8 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో మాజీ ఎంపీ డి.విట్టల్రావు కుమారుడు దేవరకొండ సురేశ్రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్రెడ్డి, నైజీరియా పెడ్లర్లు అమోబి చుక్వుడి మూనాగోలు, ఇగ్బావ్రే మైఖేల్, థామస్ అనగ కలు ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు.పరారీలో ఉన్న వారిలో టాలీవుడ్ నటుడు నవదీప్, సినీ నిర్మాత రవి ఉప్పలపాటి ఉన్నారు.
ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘బేబీ’ మాదకద్రవ్యాల దుర్వినియోగం, దాని వైభవాన్ని పూర్తిగా చిత్రీకరించినందుకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2017లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద కేసుకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించిన టాలీవుడ్ ప్రముఖులలో నవదీప్ కూడా ఉన్నాడు. పరారీలో ఉన్న నిందితుల్లో కొన్ని పబ్బుల యజమానులు కూడా ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకోవాలనుకునే వినియోగదారుల కోసం స్నార్ట్ పబ్ మరియు టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.