తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రానున్న కొన్ని గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అల్పపీడన ప్రభావంతో తక్షణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఒడిదొడుకుల మధ్యే సాగనుందని తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఎల్నినో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం సంచాలకురాలు ఎస్.స్టెల్లా తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో ఇది మధ్యస్థంగా మారి, సెప్టెంబరు నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.
గత ఏడాది జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ ముగిసే సమయానికి 15 శాతం లోటు నమోదైందని చెప్పారు. అయితే ఈ లోటు అన్ని జిల్లాల్లో ఒకేలా లేదని అన్నారు. మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షాలు కురిశాయన్నారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏకంగా 60 నుంచి 70 శాతం వరకు వర్షపాత లోటు ఉండడం గమనార్హమన్నారు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు పూడుస్తాయని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉంటాయని, ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
