Summer Alert : ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడు భగభగ మండుతున్నాడు. ఈ తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణం విభాగం (ఐఎండీ) కీలకమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఈరోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపాయి. ఎల్లుండి నుంచి తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Summer Alert) అధికారులు చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా వీచే ఛాన్స్ ఉంది. సోమవారం రోజు నగరంలోని పలు ప్రాంతాలలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో 62 శాతం తేమ ఉన్నట్లు గుర్తించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లోని అనేక మండలాల్లో 43 డిగ్రీలకుపైనే టెంపరేచర్స్ నమోదయ్యాయి. నేడు, రేపు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు.