BRS First Demand : డిసెంబరు 9 నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాన్నిఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతాంగమంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.వడ్లపై రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నం కాబట్టి విమర్శ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ తాము ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
వడ్లను ఎప్పటి నుంచి కొంటారో రేవంత్ సర్కారు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన తాము పోరాడి తీరుతామని స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి.. మేం బోనస్తో వడ్లు కొంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు.. రూ.500 బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలి. తుఫాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయి.అలాంటి వాళ్ళను ఆదుకోవాలి’’ అని ఆయన తెలిపారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన(BRS First Demand) మాట్లాడారు.