Harish Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
“రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు డిసెంబర్ 9న రుణమాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ అందలేదు. దీన్ని ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల కాలంలో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన దుస్థితి. పంట మద్దతు ధరపై రూ. 500 బోనస్ ఇవ్వాలి. అలాగే ఎకరానికి రూ. 15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాలి” అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు.
బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలు తో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.