Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల

Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్‌ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Indiramma Committee

Indiramma Committee

Indiramma Committee : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బలహీనవర్గాల పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును దసరా లోపు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను గలంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్‌ ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు. కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి, మహిళ సంఘాల నుంచి ఇద్దరు ఉంటారని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. కమిటీలో, ఎస్సీ, బీసీ సభ్యులు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే.. మున్సిపాలిటీలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌, చైర్మన్‌లు ఉంటారని పేర్కొంది సర్కార్‌. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనున్న ఈ కమిటీలు.. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

అయితే.. ఇందిరమ్మ ఇళ్లపై ఉన్నతాధికారులతో గత నెల 25న నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. వార్డు, మండలం లేదా పట్టణం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన కుటుంబాలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌ సూచించారు.

అంతేకాకుండా.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్ల స్థలాలను పొందడంలో తెలంగాణ వెనుకబడి ఉండగా, ఇతర రాష్ట్రాలు లక్షలాది ఇళ్లకు ఆమోదం తెలపడం శోచనీయమన్నారు. PMAY కింద తదుపరి దశలో తెలంగాణకు గరిష్ట కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో, పథకం కింద రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసేలా కృషి చేయాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. గృహ నిర్మాణ పథకంపై కేంద్రానికి అవసరమైన సమాచారం అందించాలని, ఎప్పటికప్పుడు డేటాను అప్ డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also : Vijayapal: రఘురామ కృష్ణరాజు కేసులో విచారణకు రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ హాజరు

  Last Updated: 11 Oct 2024, 07:24 PM IST