తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Prabhakar), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మధ్య వాడీవేడిగా వాగ్వాదం జరిగింది. బీసీల రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో గంగుల కమలాకర్, బీసీలపై మంత్రి పొన్నంకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల వ్యాఖ్యలను ఖండించారు. ‘ఆకారముంటే అవగాహన ఉంటుందనుకుంటే నేనేం చేయలేను. మీకంటే ఎక్కువే చదువుకున్నా. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఈ మాటల యుద్ధంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.
Balakrishna : తెలంగాణకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
గంగుల కమలాకర్ వ్యాఖ్యలను ఇతర మంత్రులు కూడా ఖండించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు గంగుల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘అసెంబ్లీలో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు తగవు. బీసీ రిజర్వేషన్లు వంటి ముఖ్యమైన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలి తప్ప, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదు’ అని ఆయన అన్నారు. ఈ వివాదంతో సభలో కొంత సమయం గందరగోళం ఏర్పడింది.
చివరకు సభాధ్యక్షుడు జోక్యం చేసుకొని ఇరుపక్షాలను శాంతింపజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సభా గౌరవాన్ని తగ్గించేవిగా ఉంటాయని, సభ్యులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. బలహీన వర్గాల సంక్షేమంపై చర్చించడానికి బదులు, ఇలాంటి వివాదాలు సభా సమయాన్ని వృథా చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన అసెంబ్లీలో చర్చల స్థాయిపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.