తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు విఫలం చేశారు. మంత్రిని హత్య చేయడానికి సుమారు రూ.12 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు మంత్రి హత్యా ప్లాన్ ను భగ్నం చేసి, కుట్ర కు పాల్పడిన ముఠాను అరెస్టు చేశారు.
మహబూబ్నగర్కు చెందిన నిందితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు వి శ్రీకాంత్ గౌడ్ను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర కీలక విషయాలను వెల్లడించారు. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకు వచ్చినట్ల సమాచారం. అయితే రాఘవేందర్ రాజు సహా మరికొందురు హత్యకు కుట్ర చేశారని నాగరాజు చెప్పాడు. రాఘవేందర్రాజు, మున్నూరు రవి, మధుసూధన్రాజు ఢిల్లీలో ఉన్నట్లు తేలింది. వీరి లొకేషన్ ట్రేస్ చేయగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఉన్నట్లు తేలింది. వారిని ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తెచ్చాం. వీరికి జితేందర్రెడ్డి డ్రైవర్, పీఏ రాజు షెల్టర్ అరెంజ్ చేశారు. రాఘవేంద్ర రాజు నుంచి పిస్టల్ సీజ్ చేశాం. రాఘవేంద్రరాజును ప్రశ్నించగా మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
కాగా బుధవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన నివాసం (ఢిల్లీ) నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ కు గురైనట్టు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. “నేను సంబంధిత పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశాను. సత్వర న్యాయం కోసం ఆశిస్తున్నాను” అని ట్విట్టర్లో తెలిపారు. అంతేకాదు.. సీసీటీవీ విజువల్స్ కూడా షేర్ చేశారు. అయితే ఢిల్లీ లో కిడ్నాప్ వార్తలు వినిపించడం, ఆ తర్వాత వెంటనే శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేయడం హట్ టాపిక్ గా మారాయి.