తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్ (Free Electricity Controversy)రచ్చను చంద్రబాబు వైపు మళ్లించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బషీర్ బాగ్ గాయాన్ని మళ్లీ గిల్లారు. ఆ సంఘటన మాయని మచ్చగా చంద్రబాబుకు ఉండిపోయింది. దాని వెనుక కేసీఆర్ ఉన్నారని సరికొత్త వాదాన్ని రేవంత్ రెడ్డి వినిపిస్తున్నారు. ఆ టైమ్ లో టీడీపీ హెచ్ ఆర్డీ చైర్మన్ గా కేసీఆర్ ఉన్నారు. అంతేకాదు, డిప్యూటీ స్పీకర్ గా కూడా హోదాను అనుభవిస్తున్నారు. ఆ సమయంలో విద్యుత్ చార్జీలను తగ్గించలేమని చంద్రబాబుకు సలహా కేసీఆర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు చంద్రబాబును తప్పుదోవ పట్టించడం కారణంగా బషీర్ బాగ్ కాల్పులు జరిగాయని సరికొత్త చర్చకు నాంది పలికారు రేవంత్ రెడ్డి.
పెంచిన ధరలను (Free Electricity Controversy) 20ఏళ్ల క్రితం చేసిన ఉద్యమం సందర్భంగా పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఆనాటి సంఘటన చంద్రబాబు రాజకీయ జీవితంలోని మాయని మచ్చ. అప్పటి నుంచి రైతు వ్యతిరేకిగా ఆయన మీద కాంగ్రెస్ ముద్రవేసింది. అదే ప్రచారం 2004లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. ఆనాటి గాయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరగతోడారు. ఓటుకు నోటు కేసులోనూ రేవంత్ రెడ్డి చేసిన పనికి టీడీపీ తెలంగాణ వ్యాప్తంగా ఉనికి కోల్పోయింది. ఆయన రాజకీయ జీవితం మాత్రం తారాస్థాయికి ఎగబాకింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు అనుపానుపులు తెలిసిన లీడర్ రేవంత్ రెడ్డి. ఆయన్ను అడ్డుపెట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా తిరుగులేని నాయకునిగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఫోకస్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఒక సహచరునిగా మాత్రమే చంద్రబాబుతో పనిచేశానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. టీడీపీ చీఫ్ ను రాజకీయ గురువుగా ఒప్పుకోలేని స్థాయికి రేవంత్ రెడ్డి ఎదగడం గమనార్హం.
అవసరమైనప్పుడల్లా చంద్రబాబును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడేస్తున్నారు. తెలంగాణలో 2018, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని టీడీపీలోని టాక్. ఆ తరువాత టీడీపీ ఉనికి లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం కూడా వ్యూహాత్మకంగా చెప్పుకుంటారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లే వరకు టీడీపీలోని పలువురు లీడర్లలో ఒకరుగా రేవంత్ రెడ్డి ఉండే వారు. కానీ, జైలుకు వెళ్లొచ్చిన తరువాత చంద్రబాబు ఆయన్ను నెత్తినపెట్టుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కల్పించారు. అదే హోదాతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి సహకారం అందించారని సర్వత్రా తెలుసు. కానీ, ఒక సహచరునిగా చంద్రబాబుతో కలిసి పనిచేశానని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం విచిత్రం.
ఇక బషీర్ బాగ్ విద్యుత్ కాల్పుల (Free Electricity Controversy) సమయంలో రేవంత్ రెడ్డి ఒక మండలస్థాయి లీడర్. రాష్ట్ర స్థాయిలో ఆయనెవరో కూడా తెలియదు. కానీ, ఆ రోజు కేసీఆర్ కారణంగా విద్యుత్ చార్జీలను తగ్గించడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని ఇప్పుడు చెబుతున్నారు. రాబోవు ఎన్నికల్లో చంద్రబాబు గ్రాఫ్ ను తగ్గించడానికి ఇలా చెబుతున్నారా? బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనే కోణంలో ఆలోచించి ముందుగా రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారా? నిజంగా చంద్రబాబు అప్పట్లో కేసీఆర్ మాట విన్నారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బయటకు వస్తున్నాయి.
సాధారణంగా చంద్రబాబు ఎవరి మాట వినరు. అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ తరువాత ఆయన సొంతంగా తీసుకునే నిర్ణయంపై ఎవరి ప్రమేయం ఉండదు. ఆ విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కేవలం ఉచిత విద్యుత్ (Free Electricity Controversy)రాద్దాంతాన్ని మళ్లించడానికి మాత్రమే చంద్రబాబును సీన్లోకి లాగినట్టు కనిపిస్తోంది. ఆయన కామెంట్ల మీద టీడీపీ తెలంగాణ విభాగం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో రేవంత్ రెడ్డి చెప్పినది నిజమని భావించడం సహజం. కానీ, దానిలో వాస్తవాలు ఉండే ఛాన్సు తక్కువ. ఎందుకంటే, అప్పటికే చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజకీయ గ్యాప్ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ కేసీఆర్ మీద సానుకూల దృక్పదం చంద్రబాబుకు లేదని ఆనాటి టీడీపీ నాయకులకు తెలుసు. ప్రత్యేకించి ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి అవగాహన బాగా ఉంటుంది. అందుకే, చంద్రబాబు ఏజెంట్ అంటూ రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు.
Also Read : Revanth Reddy: బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం కల
ఉచిత విద్యుత్ మీద అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నష్టం చేకూర్చేలా ఉన్నాయని అధిష్టానం భావించింది. అందుకే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఉచిత విద్యుత్ పాలసీని ప్రవేశ పెట్టిన పార్టీగా కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి రైతులకు ఉచిత విద్యుత్ (Free Electricity Controversy)ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రచారం మొదలు పెట్టింది. మూడు ఎకరాలు ఉన్న రైతుకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యను రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికి బీఆర్ఎస్ గత మూడు రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు సీన్లోకి లాగడం వెనుక లాజిక్ ఏమిటో అర్థం కావడంలేదు. ఇష్యూను డైవర్ట్ చేయడానికి చంద్రబాబును తీసుకొచ్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Revanth Reddy: అమెరికాలో తానా సభల్లో రేవంత్ కు ఘనంగా సన్మానం