Site icon HashtagU Telugu

Five Hyderabadis killed : బీదర్ లో రోడ్డు టెర్రర్.. ఐదుగురు హైదరాబాదీయులు దుర్మరణం

Accident

Accident

ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగుురు దుర్మరణం పాలయ్యారు. బీదర్ వద్ద కంటైనర్ ట్రక్కును ఎర్టికా కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వి గిరిధర్ తన బంధువులతో కలిసి కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని దత్తాత్రేయ ఆలయానికి వెళ్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన గిరిధర్ (45), ప్రియాంక (14), అనిత (30), మయాంక్ (2), డ్రైవర్ దినేష్ (35) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని శాంతిని, సరళ, సరిత, రషితగా గుర్తించగా, హర్షవర్ధన్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

సోమవారం సాయంత్రం 4 గంటలకు కారు బీదర్ హైవేపై బొంగూరు గ్రామానికి చేరుకుంది. డ్రైవర్ కంటెయినర్‌ను గమనించకపోవడమో, లేదా వాహనాన్ని అదుపు చేయడంలో విఫలమై అతి వేగంతో ఢీకొట్టాడని తెలుస్తోంది. వాహనం ముందు భాగం కంటైనర్ కిందకు వెళ్లడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 10 మంది కుటుంబంతో పాటు డ్రైవర్‌తో కలిసి ఉదయం హైదరాబాద్ నుంచి ఆలయానికి బయలుదేరారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.