Site icon HashtagU Telugu

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎంపికకు ప్రత్యేకమైన యాప్‌: మంత్రి పొంగులేటి

Minister Ponguleti

Minister Ponguleti

Minister Ponguleti Srinivasa Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించని విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు కాదు? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌పై తాజాగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామ‌ని తెలిపారు. అయితే ఇదివరకే యాప్ రెడీ అయిందని, త్వరలోనే యాప్ ను పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, పేదలకు ఇండ్లు లాంటి అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆ యాప్ లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇందులో కులం, ప్రాంతం, మతం, పార్టీ లాంటి ఏ రాజకీయ, మత విషయాలు పట్టించుకోకుండా అర్హులైన అందరకీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.

అయితే ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకం కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అర్హుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల వారితో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి అర్థమయ్యేలా తెలుగు వర్షన్ లో యాప్ తీసుకొస్తాం, ఏ ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం చేశారు. తాను సూచించిన మార్పులు పూర్తయ్యాక, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక యాప్ త్వరలోనే లాంచ్ చేస్తామని..మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

Read Also: CM Revanth Reddy : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్‌