Harish Rao: వందరోజులు దాటినా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు : హరీశ్ రావు

  • Written By:
  • Updated On - April 15, 2024 / 06:59 PM IST

Harish Rao:  కొడంగల్ కోస్గిలో నిర్వహించిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల కష్టాల గురించి రాస్తున్న ఇక్కడి కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఓడినా, గెలిచినా మనం ప్రజలవైపే. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలుచేసింది. మరి బీజేపీ చేసిందేమిటి? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది. 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది. చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచున్నారు’’ అని సెటైర్లు వేశారు.

‘‘తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నోవదయ స్కూళ్లు ఇవ్వకుండా మొండిచేయి చూపింది బీజేపీ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతానికి కేసీఆర్ నీళ్లిచ్చిండు. ఆరునెలల్లో పూర్తికావాల్సిన కరివేన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా అమలు చేయలేదు. సీఎం నియోజకవర్గంలోనే 2 లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకిచ్చిన 15 వేల రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వలేదు. రైతులు చేసేదేం లేక 1700లకు అమ్ముకుంటున్నరు’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘కేసీఆర్ రైతులకు ఇచ్చి మాట నిలబెట్టుకున్నడు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిండు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇచ్చిండు. ఆసరా పింఛన్ 4 వేలు ఇస్తామని రేవంత్ అవ్వాతాతలను కూడా మోసం చేసిండు. నెలకు 2500 ఇస్తామని మహిళలను మోసం చేసిండు. కాంగ్రెస్ ఓట్లడగడానికి వస్తే నాలుగు నెలలకు కలిపి 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని వాళ్లనూ మోసం చేసిండు రేవంత్. అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.