పరిపాలన సౌలభ్యం కొరకు భద్రాచలం ను 3 గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లుగా తిరిగి ప్రవేశ పెట్టారు. దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉందని వాదించారు.
అయితే అక్కడ ప్రజాభిప్రాయం మేరకు జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా గతంలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా భద్రాచలంలో మూడు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి తీర్మానించిందని మంత్రి తెలిపారు. ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్ తిప్పి పంపారని అట్టి బిల్లును తిరిగి ఆమోదం కోసం సభ ఏకగ్రీవంగా తీర్మాంచినట్లు మంత్రి సభకు వివరించారు అనంతరం ఆ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘‘భద్రాచలం అటు మున్సిపాలిటీ, ఇటు గ్రామపంచాయతీ కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఉండాలనేది కొందరి భావన, మున్సిపాలిటీ చేద్దామంటే కేంద్ర చట్టాలు అడ్డం వస్తున్నాయి. పంచాయతీ చేద్దామంటే ఇక్కడ కొంతమంది అడ్డుపడుతున్నారు. భద్రాచలాన్ని గ్రామపంచాయతీ చేసి అభివృద్ధిలో అన్ని గ్రామాల వలే పరుగులు పెట్టిద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.
దానికి గత అసెంబ్లీలో బిల్లుపెట్టి గ్రామపంచాయతీ చేయాలని నిర్ణయించారు. అయితే భద్రాచలం పరిధిలో 51 వేల కు పైగా జనాభా ఉండటం వలన పరిపాలన సౌలభ్యం కొరకు 3 గ్రామపంచాయతీలుగా చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి కోసమే భద్రాచలాన్ని 1. భద్రాచలం 2. సీతారంనగర్ మరియు 3. శాంతినగర్ గ్రామపంచాయతీలుగా ఏర్పరచడానికి ఈ బిల్లును పునఃప్రవేశ పెట్టడం జరిగింది.’’ అని ఎర్రబెల్లి అన్నారు.