Election Effect : మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరగబోతోంది. దీంతో హైదరాబాద్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు(Election Effect) ఓటు వేసేందుకు ఏపీ బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగింది. ఈక్రమంలో హైదరాబాద్ నగరం అవతల ఉండే చౌటుప్పల్లోని పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్ శివారులోని హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమవారాల్లో) సెలవులు ఉండటంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
ఇక ఏపీకి ఓటు వేసేందుకు వెళ్లే వారితో ఆర్టీసీ బస్సులు కూడా కిక్కిరిశాయి. బస్సు టికెట్ల బుకింగ్స్ కూడా ఇప్పుడు అంతగా దొరకడం లేదు. రైళ్లు కూడా కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు దోపిడీకి తెగబడుతున్నారు. కొన్ని ఏరియాలకు బస్సు ఛార్జీలు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. దీంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఓటు వేసేందుకు తమతమ ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. మరిన్ని బస్సులను పెంచితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.