Telangana ED: తెలంగాణలో ఈడీ దూకుడు పెంచింది. ఈ సారి నగరంలోని ప్రయివేట్ కళాశాలలో ఈడీ ఎటాక్ చేసింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన మల్లా రెడ్డి గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో ఈ కళాశాల నడుస్తోంది.
కాగా ఈడీ బృందానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లోని ప్రతిమ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయి. ప్రతిమ గ్రూప్కు చెందిన ఇతర కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, ప్రతిమ మల్టీప్లెక్స్లో కూడా కేంద్ర ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఎల్బీ నగర్ లోని కామినేని మెడికల్ కాలేజీలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్లోని ఎస్విఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డి జిల్లాలో ఎంఎస్ఆర్ మెడికల్ కాలేజీలో ఈడీ దాడి చేసింది. అయితే సంబంధిత కాలేజీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read More: Komatireddy: రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: కోమటిరెడ్డి