Eatala: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ప్రకటించిన ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక సంస్థ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల కేసీఆర్ పై మళ్ళీ ఫైరవ్వడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒక సంస్థ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల కేసీఆర్ పై మళ్ళీ ఫైరవ్వడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టింది కేసీఆర్ మాత్రమేనని ఈటల ఆరోపించారు. బీజేపీ‌ అధిష్టానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను కేసీఆర్ పై పోటీకి సిద్ధమని ఈటల తెలిపారు.

మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, అక్కడ భవిష్యత్తు లేదని ఆపార్టీ నేతలే చెప్తున్నారని ఈటల తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు కేసీఆర్ కాపలదారుడే తప్పా వారసుడు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని హెచ్చరించిన ఈటల థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి మెదట సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు.

అన్నీ అలోచించుకున్నాకనే బీజేపీలో చేరానని, తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని ప్రచారాన్ని కేసీఆర్ కావాలనే చేయిస్తున్నాడని ఆరోపించిన ఈటల బీజేపీలో గ్రూపులు లేవని బండి‌ సంజయ్ తో తనకి వైరం ఉందని టీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని, టీఆర్ఎస్ నుంచి తనకుతాను బయటకు రాలేదని వాళ్ళే తనని బయటకు పంపారని తెలిపారు.

ఏడున్నరేళ్ళుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రికి ముందుచూపు లేకపోవడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్, హరీష్, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ఈటల తెలిపారు.

కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చిందని వ్యక్తిగత అవసరాల కోసం ఎవరు లొంగిపోవద్దని ఈటల పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఓట్ల‌ కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని, పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదని ఈటల ప్రశ్నించారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా, హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని ఆయన తెలిపారు.