DSP Praneet Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావ్ ను సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రణీత్పై ఐపీసీలోని 409, 427, 201 సెక్షన్లు సహా ఐటీ యాక్ట్లోని 65, 66, 70 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రణీత్రావ్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్రావుకు సహకరించిన అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి పంజాగుట్ట పోలీసులు విచారణ జరపనున్నారు. ఈ కేసును త్వరలోనే సీఐడీ లేదా సిట్కు బదిలీ చేసే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రణీత్ రావ్ ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్ డేటాను పోలీసులు రీట్రీవ్ చేస్తున్నారు. ప్రణీత్ రావు (DSP Praneet Arrest) ట్యాప్ చేసిన ఫోన్లలో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రతిపక్ష నేతలు డబ్బులు తరలిస్తే.. ఆ విషయం ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ప్రణీత్ రావు పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చేవారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే విధంగా పెద్ద ఎత్తున విపక్షాలకు చెందిన నగదు పట్టుబడేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన ప్రణీత్ రావ్.. డ్యూటీ సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి 42 హార్డ్ డిస్క్ లను మాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 1610 పేజీల కాలే డేటాను కూడా తగలబెట్టినట్లు నిర్థారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్ లోని ఫైల్స్, కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటా సహా.. కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈఐ నంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని సైతం ట్రాష్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రణీత్రావు ప్రమోషన్ సైతం వివాదస్పదమవుతోంది. దీనిపై DSP గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు . మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయకపోయినా అడ్డదారిలో డీఎస్పీగా ప్రమోషన్ పొందారని DSP గంగాధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రణీత్రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు విచారణలో గుర్తించారు.