తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయ గిరిజనులు అటవీశాఖ అధికారి శ్రీనివాసరావును దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటవీ భూములను ఆక్రమించిన వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, ఆత్మరక్షణ కోసం అటవీశాఖాధికారులకు ఆయుధాలు అందించాలని అటవీ సిబ్బంది బుధవారం డిమాండ్ చేసింది. గుత్తి కోయ గిరిజనులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి చొరబడి అటవీ భూములను ఆక్రమించుకున్నారని, వారిని తరిమికొట్టేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియల సందర్భంగా అటవీశాఖ అధికారులు ఈ డిమాండ్లను లేవనెత్తారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కోసం వేచిచూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని సంఘాల నేతలు తెలిపారు. గుత్తి కోయ గిరిజనులను వెనక్కి పంపుతామని రెండేళ్ల క్రితం రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు.
“ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే, మేం సహోద్యోగి శ్రీనివాసరావును కోల్పోయేవాళ్లం కాదు” అని ఒక అధికారి చెప్పారు. అడవుల్లోకి వెళ్లే అటవీ సిబ్బందికి ఆయుధాలు అందజేస్తే వారికి రక్షణ లభిస్తుందని, అటవీ భూముల ఆక్రమణదారులలో భయాందోళనలు నెలకొంటాయని ఫారెస్ట్ ఆఫీసర్స్ సంఘాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియల సమయంలో అటవీశాఖ సిబ్బంది శ్రీనివాసరావు హంతకులను చంపాలంటూ నినాదాలు చేశారు.
Wife of Forest Range Officer mourns at the body of Forest Range Officer Ch Srinivas Rao in Kottagudem of Telangana. The forest ranger was murdered by Guttikoya tribals when he stopped encroachers #forestrangeofficer #Telangana #guttikoya @FawpsIndia @HarithaHaram pic.twitter.com/208n4ghv56
— Sudhakar Udumula (@sudhakarudumula) November 23, 2022