హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ను ఆపొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన ఢిల్లీ టూర్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ గురించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే స్పెషల్గా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు.. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేస్తూ ఉంటారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో రద్దీ సమయాల్లో సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల రోడ్లపై ప్రజలు నరకయాతన పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పదవి చేపట్టిన తర్వాత తన కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులు, పోలీసులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన కాన్వాయ్ కోసం రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు.
HUGE : Telangana CM Revanth Reddy directs Telangana Police to not stop traffic for public for his convoy, he will travel among the public like a commoner.
This is an extremely welcome step towards curbing the VVIP culture in India. 👏 pic.twitter.com/BuxPzn8JKJ
— Roshan Rai (@RoshanKrRaii) May 7, 2026
For years, we have all spoken about wanting an India where public roads belong to the public, not to endless VIP stoppages and flashing convoys.
Today, Hyderabad is setting that example.
Telangana CM Revanth Reddy has strictly instructed police officials not to stop traffic for… pic.twitter.com/UKMth2mcnH
— Congress Hai Hum (@Congress_HaiHum) May 7, 2026
తాజాగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆపేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో వాహనదారులను గంటల తరబడి రోడ్లపై ఆపొద్దంటూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
సీఎం కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించవద్దని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో కాకుండా ఎదురుగా, అవతలి వైపు వెళ్లే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఆదేశాలతో డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఇక నుంచి సీఎం, వీఐపీ కాన్వాయ్లు వెళ్లే సమయంలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకూడదని నిర్ణయించారు. ఒకవైపు సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మరోవైపు సింగిల్ లైన్లో మిగిలిన వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని పేర్కొన్నారు.
మరోవైపు.. త్వరలో వర్షాకాలం రానున్న నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాలని.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ లేకుండా ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రూల్స్కు విరుద్ధంగా వాహనాలను పార్క్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కేవలం ట్రాఫిక్ విభాగం బాధ్యత మాత్రమే కాదని.. శాంతి భద్రతల విభాగం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
