Deputy CM Bhatti: అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Deputy CM Bhatti

Deputy CM Bhatti

Deputy CM Bhatti: సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టల్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. శాఖల వారీగా ఈ అంశాల్లో ఉన్న బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బకాయిలకు సంబంధించి శాఖల అధికారులు బాధ్యత తీసుకొని ఆర్థిక శాఖ నుంచి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయించుకోవాలని సూచించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు సంక్షేమ హాస్టలు, గురుకులాల్లో పర్యటన కార్యక్రమం నిరంతరం కొనసాగేలా సంక్షేమ శాఖ అధికారులు ఫాలో అప్ చేసుకోవాలని సూచించారు. పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ను సంక్షేమ శాఖల అధికారులు నిత్యం ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులకు గుర్తుచేసి కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావలసిన నిధులపై కసరత్తు చేసి సీరియస్ గా ఫాలోఅప్ చేయాలని తెలిపారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని కోరారు.

Also Read: Health Insurance Vs Pollution : ఆరోగ్య బీమా పాలసీదారులకు బ్యాడ్ న్యూస్.. ఏమిటో తెలుసా?

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూముల అభివృద్ధికి ఎస్సీ ,ఎస్టీ శాఖల అధికారులు విద్యుత్తు, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ భూముల్లో సోలార్ పవర్ ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అవకాడో, వెదురు వంటి పంటల సాగుకు ప్రణాళికలు రచించి రాబోయే రెండు సంవత్సరాల్లో ఫలితాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి ఆ వర్గాల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆయా వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఏ సూచన చేసిన అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, ఇరిగేషన్ సెక్రటరీ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

  Last Updated: 21 Feb 2025, 05:58 PM IST