Dengue : డెంగీ జ్వరాల కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు నగరంలో 600కుపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. తాజాగా సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జ్వరాలతో చేరిన ప్రతి 10 మందిలో ముగ్గురికి డెంగీ ఉందని నిర్దారణ అయింది. డెంగీ వల్ల వారిలో కొందరికి కాలేయం, కిడ్నీలపై ప్రభావం పడినట్లు డాక్టర్లు గుర్తించారు. డెంగీతో పాటు చికెన్ గున్యా బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని వైద్య వర్గాలు అంటున్నాయి. టైగర్ దోమల కారణంగా డెంగీ జ్వరాల కేసులు ఇంతలా పెరుగుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెయ్యికి పైనే డెంగీ కేసులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నగరంలో డెంగీ బారిన పడివారిలో కొందరిలో తెల్ల రక్తకణాల కౌంట్ తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈవిధంగా హైదరాబాద్లో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగీ(Dengue) వల్ల ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోయి కొందరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో చేరుతుండటం ఆందోళనకరం.
We’re now on WhatsApp. Click to Join
ఇవి గుర్తుంచుకోండి..
- టైగర్ దోమ కుట్టిన నాలుగైదు రోజుల తర్వాత డెంగీ ఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల 102 డిగ్రీల జ్వరం వస్తుంది.
- కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. ఒంటిపై ఎర్రటి దద్దర్లు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా రావొచ్చు.
- ఇలాంటి టైంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగాలి.
- మూడు రోజుల తర్వాత కూడా అవే లక్షణాలు కంటిన్యూ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
- డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే ఎన్ఎస్ 1 యాంటిజెన్ పరీక్ష చేసి నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలి. జ్వరం వచ్చి అయిదు రోజులు దాటితే డెంగీ నిర్ధారణకు ఐజీఎం యాంటీబాడీల పరీక్ష చేయాలి.
- అప్రమత్తంగా ఉంటూ ప్లేట్లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకోవాలి.
- జ్వరం తగ్గినా జాగ్రత్తగా ఉండి ప్లేట్లెట్లు ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈక్రమంలో అవసరం లేకపోయినా ప్లేట్లెట్లు ఎక్కించకూడదు. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుంది.
- రక్తస్రావం కావడం, లివర్, కిడ్నీపై ప్రభావం పడటం, బీపీ తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తే అలర్ట్ కావాలి. లేదంటే బ్రెయిన్హేమరేజ్కు దారి తీయొచ్చు.