Dasoju Sravan: బీజేపీకి దాసోజు గుడ్ బై.. మళ్లీ టీఆర్ఎస్ కు జై!

తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. వివిధ పార్టీల నుంచి కీలక నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - October 21, 2022 / 01:40 PM IST

తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారుతున్నాయి. వివిధ పార్టీల నుంచి కీలక నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య బీజేపీ రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో కీలక నేత బీజేపీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ లో రేవంత్ ను వ్యతిరేకించిన దాసోజు శ్రవణ్ మళ్లీ టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం దాసోజు శ్రవణ్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

బీజేపీ రాజీనామా చేసిన దాసోజు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన లాంటి బలహీన వర్గాలకు చెందిన నేతలకు బీజేపీలో స్థానం ఉండదనే విషయం అర్థమయిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని దుయ్యబట్టారు. డబ్బు, మద్యం అండతో గెలవాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. దశ, దిశ లేకుండా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని దాసోజు స్పష్టం చేశారు.

అయితే గతంలో టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. మళ్లీ దాసోజు టీఆర్ఎస్ లో చేరుతుండటం ఆసక్తిని రేపుతోంది. కాగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పల్లె రవికుమార్ దంపతులు సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.