తెలంగాణలో కొత్త సీఎం, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. పలువురికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే మంత్రులు పరుగులు పెడుతున్నారు. రెండు పథకాల్ని అప్పుడే ప్రారంభించేశారు. పాలనలో దూకుడు చూపిస్తున్నారు. ఇక మంత్రులు జిల్లాలకు వెళ్తున్నారు. ఆందోల్ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహకు కొత్త ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు.
నేడు దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు దామోదర రాజనర్సింహ.
దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నాం. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మీ పథకాలని అమలు చేశాం. వంద రోజుల్లో మిగతా నాలుగు హామీలను కూడా అమలు చేస్తాం. ఆందోల్ కు యాభై పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నాం. అసలైన తెలంగాణ ఇప్పుడొచ్చింది. ఇన్నాళ్ళు కన్న కలలు నిజం కాబోతున్నాయి. పేదవారికి సరైన పాలన అందివ్వడమే మా ధ్యేయం. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తాం, ఒక మంచి పాలసీని తీసుకొస్తాం. వైద్యరంగంలో 23 ఉప శాఖలు ఉన్నాయి, వాటిని బలోపేతం చేస్తాం అని తెలిపారు. దీంతో మంత్రి అవ్వగానే తన నియోజకవర్గానికి 50 పడకల ఆసుపత్రి ప్రకటించడంతో నియోజకవర్గ ప్రజలు అభినందిస్తుండగా ఈ అంశం వైరల్ గా మారింది.
Also Read : Nizamabad : మహిళ నుండి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన బస్సు కండక్టర్..