తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్. అయినప్పటికీ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ల వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్యమాత్రం పెరగడం లేదు. దీంతో ఈ మహమ్మారి వల్ల మరణాలు కూడా పూర్తిగా తగ్గాయి. కాగా ఈ వైరస్ బారినపడివాళ్లు మూడు, నాలుగు రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఈనెల 1 నుంచి 9వ తేదీల మధ్య తెలంగాణలో కోవిడ్ కేసులు 481 నుంచి 5,189కి పెరిగాయి. కానీ ఈ 9 రోజుల్లో వైరస్ వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదు. గత మూడు వేవ్ లకు పూర్తిగా భిన్నంగా ఈ సారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. వైరస్ బాధితులు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.
కోవిడ్ రెండవ, మూడవ దశల్లో రాష్ట్రంలో 80వేల మందికి పైగా కోవిడ్ రోగులకు చికిత్స అందించిన గాంధీఆసుపత్రిలో ఈ మధ్య ఒక్కరు కూడా అత్యవసర విభాగంలో చికిత్స తీసుకోకపోవడం గమనార్హం. తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా…ఆసుపత్రుల్లో మాత్రం చేరడం లేదు. ఆక్సిజన్ సపోర్టు కూడా అవసరం లేదు. నిజానికి పాజిటివ్ గా ఉన్న వ్యక్తులు మూడు నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వైరస్ సమయంలో రోగులు కోలుకునేందుకు కనీసం వారం పదిహేను రోజులు పట్టింది. కానీ ఇప్పుడు భిన్నంగా మూడు రోజుల్లోనే కోలుకోవడం మంచి సంకేతమని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు.