Telangana: రానున్న ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారం చేపట్టడం ఖాయమన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ, హుజూర్నగర్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి హేళన చేశారు. తెలంగాణలో 80 సీట్లకు పైగా గెలిచి తదుపరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణలోని 10 జిల్లాల్లో తొమ్మిదింటిలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని, నల్గొండ జిల్లాలో మొత్తం స్వీప్ చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ గెలుపుపై తప్పుడు ప్రకటనలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్కు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు దారుణంగా మారాయని ఉత్తమ్ చెప్పారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేయలేక పోతున్నారని దుయ్యబట్టారు.
గడిచిన రెండు పర్యాయాలు బీఆర్ఎస్ సామాన్య ప్రజలను మోసం చేసిందని, ఈసారి ప్రజలు మోసపోయే పరిస్థితి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించిందని, మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు డబ్బులు అందినట్లుగాప్రచారం చేసుకుంటుందని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ అబద్దపు ప్రచారాలు చేస్తునట్టు ఉత్తమ్ ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీ వర్గాలందరూ బీఆర్ఎస్ పాలనలో మోసపోతున్నారని గ్రహించారని అన్నారు.
బీఆర్ఎస్ను అధికారం నుంచి గద్దె దించేందుకు కాంగ్రెస్కు అనుకూలంగా పెద్దఎత్తున ఓటింగ్ జరుగుతుందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ గెలుపుపై బూటకపు సర్వేలు, తప్పుడు వాదనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీతో గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు తమ ఓట్లను దండుకునేందుకు ఇస్తున్న డబ్బు, ఇతర బహుమతులతో ఆకర్షితులవవద్దని కోరారు. రాజీ పడితే అది పిల్లల భవిష్యత్తును శాశ్వతంగా పాడుచేస్తుందని ఆయన అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని అన్నారు.
Also Read: GST Notices: స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై రూ.500 కోట్ల జిఎస్టి