MLC Candidates : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే క్యాండిడేట్స్ను దృష్టిలో ఉంచుకొని 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. పాడి కౌశిక్రెడ్డి, కడియం శ్రీహరిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖాళీ అయిన వాటిలో ఒకటి రెడ్డి, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి. దీంతో పార్టీపరమైన లాభనష్టాలను అంచనా వేసుకొని అభ్యర్థులను హస్తం పార్టీ ఎంపిక(MLC Candidates) చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join.
పీసీసీ సంస్థాగత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్(బీసీ),పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (ఎస్సీ), సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, హుజూరాబాద్ టికెట్ ఆశించి భంగపడిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ శాసనమండలి పదవుల ఆశిస్తున్నారు. వీరిలో నలుగురిని పక్కనబెట్టి, మరో ఇద్దరి పేర్లపై ఆమోద ముద్ర వేశారని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చలు జరిపిన దీనిపై నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని చెబుతున్నారు.
సూర్యాపేట టికెట్ పటేల్ రమేశ్రెడ్డికి ఇవ్వలేకపోయినందున, అయనకు నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని సమాచారం. అయితే నల్గొండ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆశిస్తున్నందున.. పటేల్ రమేశ్రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి జానారెడ్డికి పోటీ లేకుండా చేయాలని భావిస్తున్నారట. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా విజయాబాయిని బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఆ స్థానాన్ని ఆశిస్తున్న బలరాంనాయక్కు ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉందట. ఈరోజు నుంచి ఈనెల 18 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం అభ్యర్ధులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.ఈనేపథ్యంలో ఇవాళో, రేపో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. ఆయా స్థానాల్లో రిజర్వేషన్ ప్రకారం మంచి నాయకులను నామినేట్ చేసేందుకు ప్రయారిటీ ఇవ్వనున్నారు.