Congress Panel: టీకాంగ్రెస్ ‘ఆకర్ష్’.. చేరికలపై ఫోకస్!

కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతల చేరికలను పరిశీలించేందుకు కమిటీకి సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Sonia Gandhi

Sonia Gandhi Congress

కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతల చేరికలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. మాజీ మంత్రి కె. జానారెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ ప్యానెల్‌లో టీపీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌లు పొన్నాల లక్ష్మయ్య, ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఐదుగురు సభ్యులుగా ఉంటారు. కాగా, మే 6న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు పార్టీ సిద్ధమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఏప్రిల్ 21న వరంగల్‌కు రానున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించనున్నారు.

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే రేవంత్ రెడ్డితో ఇతర పార్టీల నేతలు టచ్ లోకి వచ్చారు. ఆయన వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ఆకర్ష్ కు తెరలెపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్, డీఎస్ కుమారుడితో సైతం సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారు కావడంతో టీకాంగ్రెస్ ఇతర పార్టీల నేతలపై ఫోకస్ చేస్తోంది. రాహుల్ సమక్షంలో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం చేరికల కోసం ప్రత్యేక కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.

  Last Updated: 21 Apr 2022, 01:49 PM IST