Congress Second List : ఆశావహ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా రిలీజ్ కానుంది. ఈవిషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. రెండో జాబితాలో 45 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలిపారు.ఇవాళ ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ మీటింగ్లోనే 45 మంది అభ్యర్థులు ఎవరనేది ఖరారు చేశారు. ఇందులో రెండు స్థానాలను సీపీఎం, సీపీఐకి కేటాయించామని మురళీధరన్ తెలిపారు. గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో వడపోత చేపట్టినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ తొలి జాబితా తరహాలోనే రెండో జాబితాలో కూడా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందన్నారు. కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారికి టిక్కెట్లు ఇస్తున్నామన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈసారి అధికారంలోకి రావాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయడం అవసరమని మురళీధరన్ స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు , నీలం మధు తదితరులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి టికెట్ల కేటాయింపుపై ఈ మీటింగ్లో డిస్కస్ చేశారని సమాచారం. గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట వంటి స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేతలను బరిలోకి దింపే విషయంపై చర్చించారని తెలిసింది. ఇతర పార్టీల నుంచి చేరికలు, లెఫ్ట్ పార్టీలతో పొత్తు విషయమై 11 స్థానాలను పెండింగ్ లో ఉంచారట. ఈ నెల 15న రిలీజ్ చేసిన కాంగ్రెస్ తొలి జాబితాలో 55 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. మిగతా 19 స్థానాలకు అభ్యర్థుల పేర్లను మరో రెండు, మూడు రోజుల్లోగా ప్రకటిస్తారని(Congress Second List) అంటున్నారు.