Kodandaram : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు కీలక అవకాశం లభించబోతోంది. ఉన్నత విద్యావంతుడైన కోందండరాంను శాసనమండలికి పంపాలని కాంగ్రెస్ భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది కుదరకపోతే.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా నియమించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోందట.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగులు ముఖ్య పాత్ర పోషించారు. వారి ఆలోచనలో వచ్చిన మార్పు వల్లే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. గ్రూప్ 1, 2 పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీలు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ను మార్చకపోవటం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నిరుద్యోగుల బాధలు తెలిసిన ప్రొఫెసర్ కోదండరాంను టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా నియమించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం. కోదండరాం వంటి నిస్వార్థ వ్యక్తులకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవిని అప్పగిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో హై కమాండ్ ఉందని తెలుస్తోంది. తద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ యువతను తమ వైపునకు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోందట. ఇక రాజ్యసభకు పంపిస్తామని రాహుల్ గాంధీ నుంచి గతంలో కోదండరాంకు హామీ లభించిందని కూడా అంటున్నారు. ఇంకొన్ని రోజులైతే ఆయనకు ఏ పదవి ఇస్తారనే దానిపై క్లారిటీ(Kodandaram) వచ్చేస్తుంది.