తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకుని సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. ఇప్పటికే పలు వర్గాల ప్రజలకు పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం, తాజాగా కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో రేషన్ కార్డుల లేమి కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న కుటుంబాలకు ఈ నిర్ణయం కొత్త ఆశలు కలిగించింది.
కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ఉచిత విద్యుత్తు (Free Curent), రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలు వర్తించనున్నాయి. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. గతంలో కార్డులు లేని కారణంగా మినహాయింపునకు గురైన కుటుంబాలకు ఇది మరొకసారి అవకాశం అని చెప్పాలి.
Prakasam District: వింత ఆచారం.. అక్కడ వధువు అబ్బాయి, వరుడు అమ్మాయి..ఎందుకో తెలుసా..?
ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో “గృహజ్యోతి”లో 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, రూ.500 రాయితీ గ్యాస్ సిలిండర్ పథకాలు ఉన్నాయి. వీటి కోసం రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. రేషన్ కార్డు ఉన్నా గతంలో పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు, గ్యాస్ కనెక్షన్ ధ్రువీకరణ పత్రాలు కౌంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రజాపాలన సేవాకేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియగా దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పథకాలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.