- చాల నెలల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు
కొద్దీ నెలలుగా మీడియా కు , ప్రజలకు దూరంగా ఉన్న మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ , ఎట్టకేలకు ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. దాదాపు గంటన్నర సేపు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు , ఆరోపణలు చేసారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది.
పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, రాష్ట్ర సంపదను దోచుకున్నారని, అందుకే ఓటమి భయంతో ఇన్నాళ్లు ఫార్మ్హౌస్కే పరిమితమయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఇప్పుడు మళ్లీ రాజకీయ ఉనికి కోసం బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేశారని, ఈ భారం రాబోయే రెండు దశాబ్దాల పాటు ప్రజలపైనే ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. గత పదేళ్ల పాలనలో భారీ కుంభకోణాలు జరిగాయని, రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులే హారతి పట్టారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విచారణల నుండి, ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికే కేసీఆర్ ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారని, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని విమర్శిస్తున్నారు. అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాయన్నది కాంగ్రెస్ ప్రధాన వాదన.
కేసీఆర్ అకస్మాత్తుగా బయటకు రావడం వెనుక పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుస వైఫల్యాలను చవిచూడటం, మరోవైపు హరీష్ రావు బలమైన నేతగా ఎదగడం కేసీఆర్ను ఆందోళనకు గురిచేసిందని కాంగ్రెస్ వాదిస్తోంది. పార్టీపై తన పట్టు కోల్పోకుండా ఉండటానికి, హరీష్ రావును అణగదొక్కడానికే ఆయన మళ్లీ తెరపైకి వచ్చారని విమర్శకులు అంటున్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినప్పటికీ, కేసీఆర్ ఇంకా తన అహంకారాన్ని వీడలేదని, అధికార దాహంతోనే ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
