`తనదాకా వస్తేగాని నొప్పి తెలియదని నానుడి`. ఇప్పుడు ఇదే నానుడిని కేసీఆర్ కు వర్తింప చేస్తే ఫౌంహౌస్ డీల్ కు సరిపోతుంది. ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని రచ్చ చేశారు. సుమారు రూ. 100 కోట్ల డీల్ జరిగిందని ఆయన సొంత మీడియా బాకా కొట్టింది. నైతికతను ప్రశ్నిస్తూ బీజేపీని టార్గెట్ చేసిన వైనం చూశాం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల సంగతి తెరమీదకు వస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫాంహౌస్ డీల్ తో పాటుగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాగేసుకున్న ఎపిసోడ్ మీద కూడా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ ఏబీసీకి వినతపత్రాన్ని అందచేశారు. ఇప్పటికే పలు అంశాలపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలకు కల్వకుంట్ల కుటుంబం మీద ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆనాడు కేసీఆర్ ఎంత ఆఫర్ చేశారో తేల్చాలని ఏసీబీని కోరారు.
Also Read: KTR’s Reaction on the Farm House Deal: ఫౌంహౌస్ డీల్ కు `యాదాద్రి` ప్లేవర్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. పైగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇదంతా కేసీఆర్ సమక్షంలో జరిగిన తతంగం. ఆనాడు బంగారు తెలంగాణ కోసం వాళ్లందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని కల్వకుంట్ల కుటుంబం చెప్పింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించడాన్ని కేసీఆర్ తప్పుబడుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కేసీఆర్ తీసుకోవడానికి ఒక న్యాయం, ఆయన పార్టీ నుంచి ఇతరులు తీసుకుంటే మరోక న్యాయమా? అంటూ జడ్సన్ ప్రశ్నిస్తున్నారు.