Kishan Reddy Vs MIM – Congress : తెలంగాణలోని హై ప్రొఫైల్ లోక్సభ సీట్లలో ఒకటి సికింద్రాబాద్. ఇది కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఈ స్థానం కాంగ్రెస్ ఖాతాలోకి రావాలనే పట్టుదలతో ఆయన ఉన్నారని సమాచారం. ఈక్రమంలోనే సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్లో చేర్చుకొని మరీ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డిని ఓడించేందుకు ఆ నియోజకవర్గం వరకు మజ్లిస్తోనూ చెయ్యి కలిపేందుకూ రేవంత్ రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
దానం నాగేందర్కు ప్లస్ పాయింట్స్
- కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్(Kishan Reddy Vs MIM – Congress) ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
- దానం నాగేందర్ కు సొంత బలం, బలగం ఉంది.
- సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని నాంపల్లి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు దానం నాగేందర్కు ఉంది.
- ముస్లిం వర్గాలతోనూ దానంకు మంచి సంబంధాలు ఉన్నాయి. మజ్లిస్ నాయకులతోనూ ఆయన సఖ్యంగా ఉంటారు.
- సికింద్రాబాద్లో ఈసారి మజ్లిస్ పార్టీ అభ్యర్థిని నిలిపే అవకాశం లేకపోవడం దానం నాగేందర్కు అడ్వాంటేజ్. దీనివల్ల ముస్లిం వర్గం ఓట్లు కాంగ్రెస్ కు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంది.
- నియోజకవర్గం పరిధిలో 5లక్షల మందికిపైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారు.
- ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడా దానం నాగేందర్ వైపే నిలిచే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
- దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల బీసీ ఓట్లు సమైక్యం అవుతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన కులగణన హామీతో ఈ నియోజకవర్గంలోని దాదాపు 3 లక్షల మంది బీసీలు కాంగ్రెస్కు చేరువయ్యారనే టాక్ వినిపిస్తోంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బలాబలాలు..
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో గట్టిపోటీని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు అంటున్నారు.
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం అంబర్ పేటలోనూ బీజేపీ పట్టు కోల్పోవడం కిషన్ రెడ్డికి ప్రతికూల అంశంగా మారనుంది.
- గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల చీలిక వల్ల సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి లాభపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డీలా పడింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. దీంతో ఓట్ల చీలిక జరిగే అవకాశం లేదు. ఇది కిషన్ రెడ్డి గెలుపును ప్రభావితం చేసే అంశంగా మారనుంది.
- అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ తరపున సీరియస్ గా పని చేయడానికి ఎమ్మెల్యేలు కూడా రెడీగా లేరు.
- 2019 సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి 44.84 శాతం ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్కు 35.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎం అంజన్ కుమార్ యాదవ్ కు 19.1 శాతం ఓట్లు వచ్చాయి.