Congress : మేడ్చల్ కాంగ్రెస్ సీటు ద‌క్కేది ఎవ‌రికి..?

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల ర‌గ‌డ కొన‌సాగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైన అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్

  • Written By:
  • Updated On - July 20, 2023 / 07:40 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల ర‌గ‌డ కొన‌సాగుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైన అధికారంలోకి రావాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. గెలిచేవారికే ఈ సారి సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ద‌మైంది. క‌ర్ణాట‌క గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ‌లో కూడా వేవ్ మొద‌లైంది. దీంతో టీకాంగ్రెస్‌లో సీట్ల కోసం పోటీ పెరిగింది. రోజురోజుకీ కొత్త వ్య‌క్తులు తెర‌మీద‌కు వ‌స్తున్నారు. తమకే సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ లో ఎవరికి సీటు అనేది డిసైడ్ చేసేది మాత్రం హైకమాండ్. పార్టీ జెండా భుజాన వేసి మోసిన వారికే ప్రాధన్యత ఉంటుంద‌ని అధిష్టానం చెబుతుంది. కొత్తగా పార్టీలో చేరిన వారంతా తమకు సీట్లు ఖాయమంటూ చేసుకుంటున్న ప్రచారంతో డొల్ల తనం బయట పడుతోంది. తాజాగా తీన్మార్ మల్లన్న తనకు మేడ్చల్ కాంగ్రెస్ సీటు ఖాయమని ఆయ‌న ప్రమోట్ చేసుకుంటున్నారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆయ‌న‌కు ఎలాంటి హామీ దక్కలేదు. మేడ్చల్ లో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నా..నష్టాలు భరించి పని చేసిన నేతలు ఉన్నారు. వారి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో పెరిగిన జోష్ తో టికెట్ల పైన పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారం ఖాయమని నమ్మి పార్టీలోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు ముఖ్య నేతలు తమతో పాటుగా తమ విధేయులకు సీట్లు కావాలంటూ పార్టీలో చేరిక సమయంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొంత వరకు వారి షరతులకు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతోంది. అదే సమయంలో పార్టీని తొలి నుంచి నమ్ముకున్న వారు ఉన్న స్థానాల్లో మాత్రం ఆచి తూచి స్పందిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి కొత్త వారికి ప్రాధాన్యత ఉండదని తాజాగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశం లో హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మేడ్చల్ నియోజకవర్గం అంశం తెర మీదకు వచ్చింది.

కాంగ్రెస్ సీటు తనకే అంటూ తీన్మార్ మల్లన్న కొంత కాలంగా ప్రమోట్ చేసుకుంటున్న అంశం చర్చగా మారింది. సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న తానే కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు.
దీనిని పార్టీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాము ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కోసం మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డితో పాటుగా జంగయ్య యాదవ్, హరి వర్ధన్ రెడ్డి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు మల్లన్న తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకోవటం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ అందరి సమిష్టి నిర్ణయం మేరకు అభ్యర్ధిని ఖరారు చేసి..అందరూ అభ్యర్ధి గెలుపుకు పని చేసేలా టికెట్ల ఖరారు విషయంలో హైకమాండ్ ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది.