KTR: కేరళ, కర్ణాటక, గుజరాత్ నుంచి తెలంగాణలోకి కంపెనీలు తరలి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థిరమైన ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాజకీయ అస్థిరత కారణంగా పారిశ్రామిక రంగం దారుణంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు.
10 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించడంతో మైసూర్కు చెందిన కేన్స్ టెక్నాలజీ కంపెనీ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీ మొదట కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని ఆయన పేర్కొన్నారు. భూమి కేటాయించాలని కంపెనీ విజ్ఞప్తి చేసినా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ముగ్ధుడై కొంగర కలాన్లో తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
కర్నాటకలో విద్యుత్ సంక్షోభాన్ని గురించి మాట్లాడిన కేటీఆర్, రైతులు, ఇతర రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో తెలంగాణలో విద్యుత్ సామర్థ్యాన్ని 7,000 మెగావాట్ల నుంచి 24,000 మెగావాట్లకు పెంచారని, ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు కౌంటర్ ఇస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు లేదని కేటీఆర్ అన్నారు. కాగా.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: world cup 2023: నా లైఫ్ మొత్తంలో బెస్ట్ ఇన్నింగ్స్ ..మ్యాక్స్ వెల్ పై సచిన్