CM Revanth: కలెక్టర్లపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు కార్యాలయాలు కూడ దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సేవల విభాగాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని ఆదేశించారు.
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన పలు శాఖలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత అధికారులదేనని ఉద్ఘాటించారు. వినూత్న ఆలోచనలు, ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలను అవలంబించాలని, ప్రతి అధికారి రెండు వారాల్లోగా ప్రభుత్వం ముందుంచాలని సూచించారు.ప్రతి వారం వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని చెప్పారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడమే ఈ పర్యటనల లక్ష్యమని ఆయన నొక్కి చెప్పారు. ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.
ఉన్నత విజయాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలతో పాటు వారి పనితీరు వారి అవకాశాలను నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి అధికారులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు తప్పవని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు పాటించాలని ఆయన హెచ్చరిస్తున్నారు. కాగా ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, మొత్తం 29 శాఖల ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: Bhole Baba : ‘భోలే బాబా’ ఎవరు ? హాథ్రస్ తొక్కిసలాటలో 116 మంది మృతికి కారణమేంటి?