మొయినాబాద్లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది. శనివారం రాత్రి తెలంగాణ ‘ఈగల్ టీమ్’ జరిపిన ఆకస్మిక దాడుల్లో డ్రగ్స్ వినియోగం బయటపడటమే కాకుండా, పోలీసులపై నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతను చాటిచెప్పింది. ఈ కేసులో మొత్తం 11 మందిపై పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఈ జాబితాలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డితో పాటు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వంటి కీలక వ్యక్తులు ఉండటం గమనార్హం. ఇప్పటికే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా, పోలీసులు ముగ్గురిని రిమాండ్కు తరలించారు.
ఈ కేసుపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. డ్రగ్స్ విషయంలో తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కొంతమందికి స్టేషన్ బెయిల్ లభించడంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. పోలీసులు పూర్తిగా నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వం జోక్యం ఏమీ లేదని ఆయన వివరించారు. ఈ కేసులో లోతైన విచారణ జరిపి, అసలు నిందితులను పట్టుకునేందుకు తొమ్మిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజకీయ రంగు పూయకుండా కేవలం నేరం ఆధారంగానే దర్యాప్తు జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
అయితే, డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఆరుగురిలో కేవలం ముగ్గురిని (రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ) మాత్రమే అరెస్ట్ చేసి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసు వర్గాలు స్పందిస్తూ.. కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నవారిని, డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషించిన వారిని మాత్రమే రిమాండ్కు పంపామని, మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ రంగంలోకి దిగడంతో, ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్వర్క్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం కానుంది.
