Site icon HashtagU Telugu

Rajiv Gandhi Civil Abhaya Hastham : ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

Rajiv Gandhi Civils Abhaya

Rajiv Gandhi Civils Abhaya

తెలంగాణ (Telangana) లో మరో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ (Rajiv Gandhi Civil Abhaya Hastham) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాం‍గ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడే పార్టీ అని నిరూపించుకుంటుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రధానంగా దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలను అమలు చేసిది. అన్నింటికంటే ప్రధానమైన హామీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు ప్రారంభించి రైతుల్లో సంబరాలు నింపింది. ప్రస్తుతం లక్ష రూపాయిల మాఫీ చేసిన సర్కార్..ఆగస్టు 15 నాటికి పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపింది. ఇలా అనేక హామీలు నెరవేరుస్తూ వస్తున్న రేవంత్..ఈరోజు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధలు తెలుసని.. వారి సమస్యల పరిష్కారినికి తొలి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని.. అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. అలాగే జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకునే గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు.

Read Also : Life Threat to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక