ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. సర్కార్ ఏర్పాటు చేసిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి నేడు ముహుర్తం ఖరారు చేశారు. సర్కార్ నూతనంగా చేపట్టి నిర్మించిన ఈ 8 వైద్య కళాశాలలను ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఏకకాలంలోనే ఆన్ లైన్లో తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల,జగిత్యాలతోపాటు వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్,రామగుండం వైద్య కాలేజీల్లో విద్యాబోధన షురూ కానుంది. దీంతో 8 కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కోర్సు చదివే విద్యార్థుల విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలాగే మరికొద్ది రోజుల్లో రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీ ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి.