మోడీ సర్కార్పై రాజకీయ దాడి చేయడానికి కేసీఆర్ తడబడుతున్నాడు. ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నాడు. హుజురాబాద్ ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అదే దూకుడుతో కేసీఆర్ వెళతారని ఆ పార్టీలోని వాళ్లు భావించారు. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత మౌనంగా ఉండిపోయాడు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశం తరువాత స్పీడు పెంచినట్టు అర్థం అవుతోంది. కాశీ కారిడార్ ప్రారంభం సందర్భంగా మోడీ చేసిన ప్రసంగాన్ని రాజకీయ కోణం నుంచి కేసీఆర్ చూస్తున్నాడు. ఇటీవల సరిహద్దుల్లోని భారత సైన్యం గురించి ప్రస్తావించి వెనక్కు తగ్గాడు.తెలంగాణ భవన్లో ఆయన చేసిన దిశానిర్దేశంలోని ఆంతర్యాన్ని గమనిస్తే…ఎన్నికలకు సిద్ధం కావాలని డైరెక్షన్ ఇచ్చేశాడు. ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తానని హెచ్చరించాడు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో..తెలుసంటూ సర్వేలను ఉటంకించాడు. అంటే, ఎన్నికలకు వెళ్లే ముందుగా సహజంగా చేసే కసరత్తు ప్రారంభం అయిందని సంకేతాలు ఇచ్చేశాడు. అంతేకాదు,ఈసారి కేంద్రంపై రాజకీయ దాడి చేస్తేనే అధికారంలోకి రాగలమనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చాడు. ఆ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశాడని ఆయన చేసిన ప్రసంగం ద్వారా స్పష్టం అవుతోంది.
ఉద్యమ నాయకునిగా 2014 ఎన్నికల్లో బొటాబొటి మోజార్టీతో ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశాడు. మైనార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నం చేశారని ఆయన గ్రహించాడు. వెంటనే ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను సామదానదండోపాయాలతో టీఆర్ఎస్ వైపు లాగేసుకున్నాడు బలమైన పార్టీగా అసెంబ్లీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. విద్యుత్, నీళ్ల సరఫరా విషయంలో సంపూర్ణంగా విజయం సాధించాడు. ఈ రెండు అంశాలను హైలెట్ చేస్తూ 2018 ఎన్నికలకు వెళ్లాడు.ముందస్తు ఎన్నికలకు ఆనాడు వెళ్లిన ఆయనకు అభివృద్ధితో పాటు సెంటిమెంట్ తోడు అయింది. కాంగ్రెస్ పార్టీతో కలసి చంద్రబాబు తెలంగాణపై మళ్లీ దాడి చేయడానికి వస్తున్నాడని ప్రచారం చేయడంతో సెంటిమెంట్ పనిచేసింది. సంపూర్ణ బలానికి అవసరమైన స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నాడు. ప్రతిపక్షం లేకుండా దాదాపుగా చేశాడు.
ఇప్పుడు మూడోసారి సీఎం కావడానికి కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నాడు. సెంటిమెంట్ ఈసారి పనిచేయదని గ్రహించాడు. వ్యతిరేకత బాగా ఉందని సర్వేల ద్వారా తెలుసుకున్నాడు. ఉద్యమకారులు తిరగబడుతున్నారని అర్థం అయింది. పలు వర్గాల ప్రజలు సంతృప్తికరంగా లేరని హుజురాబాద్, దుబ్బాక ఫలితాల ద్వారా బోధపడింది. కాంగ్రెస్, బీజేపీ బలపడుతున్నాయన్న విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. దీంతో ఈసారి కేంద్రంపై వ్యతిరేక అస్త్రాన్ని ప్రయోగిస్తే విజయం సాధించ వచ్చని ఎత్తుగడ వేశాడని విశ్లేషకులు భావిస్తున్నారు.దేశ వ్యాప్తంగా బీజేపీపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నాడు. ప్రత్యేకించి రైతులు, మహిళలు, వ్యాపార, నిరుద్యోగులు వర్గాలు మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నాయని భావిస్తున్నాడు. అందుకే , ఇప్పుడు మోడీ సర్కార్ మీద రాజకీయ దాడిని ప్రారంభించాడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కూడా తమవైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నాడు.
ఆ క్రమంలోనే మంత్రులు ఢిల్లీకి వెళ్లాలని ఆదేశించాడు. జిల్లా పర్యటనలను కూడా వాయిదా వేసుకున్నాడు. వనపర్తి, జనగాం జిల్లాలకు వెళ్లడంలేదని చెప్పేశాడు.ఈనె 20న తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చావు దండోరాపై ఎప్పటికప్పుడు సమీక్షించడానికి రెడీ అయ్యాడు. గల్లీ టూ ఢిల్లీ పోరాటాలు చేయడం ద్వారా తెలంగాణ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను కేంద్రంపై తోసేయాలని కేసీఆర్ ఎత్తుగడ వేశాడు. ఆయన స్కెచ్ ఈసారి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.