అంతర్జాతీయ స్థాయిలో పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్, జర్మనీలో జరిగిన ఐ.ఎస్.ఎస్.ఎఫ్. జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఇషా సింగ్లకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ వారికి రూ.2కోట్ల చొప్పున చెక్కులను అందజేసి సత్కరించారు. దీంతో పాటు కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నజరానా చెక్కు కూడా కేసీఆర్ ఆయనకు అందించి సన్మానించారు. నిఖత్ జరీన్, ఇషాసింగ్లకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాస స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. మొగిలయ్య కోరినట్లు ఆయనకు బీఎన్రెడ్డి నగర్ కాలనీలో ఇంటిస్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది.