Doctors Report: ముఖ్య‌మంత్రికి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల్లేవ్‌!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పటల్ వైద్యబృందం స్పష్టం చేసింది.

  • Written By:
  • Updated On - March 11, 2022 / 05:28 PM IST

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పరీక్షలు నిర్వహించిన సోమాజిగూడ యశోద హాస్పటల్ వైద్యబృందం స్పష్టం చేసింది. నీరసం, చేతి నొప్పితే యశోద హాస్పటల్ కు వచ్చిన సీఎం కెసిఆర్ గారికి శుక్రవారం యశోద దవాఖాన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యులు, పిజీషియన్ ఎంవి రావు, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విష్ణురెడ్డి సారథ్యంలోని వైద్యుల బృందం ఈ పరీక్షలు నిర్వహించింది.

పరీక్షల అనంతరం వారు సోమాజిగూడ యశోదా దవాఖాన నుంచి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు. గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల రిపోర్ట్ సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగానే ఎడమ చేయి నొప్పిగా ఉంటున్నదని నిర్ధారించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇది వయసు రీత్యా వచ్చే సమస్యేనని డాక్టర్లు స్పష్టం చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సీఎం కెసిఆర్ సూచించినట్లు తెలిపారు. వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రిగారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని డాక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సీఎం కెసిఆర్ గారు మధ్యాహ్నం 3 గం.లకు ప్రగతి భవన్ అధికార నివాసానికి చేరుకున్నారు. సీఎం వెంట కుటుంబ సభ్యులు సతీమణి శోభ, మనవడు హిమాన్షు, మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,మంత్రి హరీష్ రావు లతో పాటు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.

యశోద డాక్టర్ల బృందం ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:

• ముఖ్యమంత్రి రెండు రోజులుగా నీరసంగా ఉందన్నారు.
• ఈ రోజు ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు ఇంటికి వెళ్లి చూశారు.
• హాస్పిటల్ కు వచ్చి పరీక్షలు చేయించుకుంటే మంచిదనడంతో సీఎం గారు అంగీకరించారు.
• దాంతో వారిని ఇక్కడ హాస్పిటల్ కు తీసుకొచ్చాం.
• ఎడమ చేయి నొప్పి ఎందుకొచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేశాం.

• ముఖ్యమంత్రి ఇంటికెళ్లి పరిశీలించాం.
• కొన్ని టెస్టులు చేయించాల‌ని సూచించాం.
• ఎడమ చేయి నొప్పి అని చెప్పారు కాబట్టి, కరోనరీ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనే ఉద్దేశ్యంతో కరోనరీ యాంజియోగ్రాం చేశాం. అందులో అదృష్టవశాత్తూ బ్లాక్స్ ఏమీ లేవు.
• హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ఈసీజీ, 2డీ ఎకో టెస్టులు కూడా చేశాం. ఆ రెండు కూడా బాగున్నాయి.
• తర్వాత హార్ట్ కు సంబంధించినటువంటి రక్త పరీక్షలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్టులు కూడా నార్మల్ గానే ఉన్నాయి.
• ఈ రిపోర్టులన్నింటిని పరిశీలించి ముఖ్య‌మంత్రి హృదయానికి సంబంధించిన ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్ లేదని మేం నిర్ధారించాం.
• ఆ తర్వాత ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించడం జరిగింది.
• మెడకు సంబంధించినటువంటి ఎంఆర్ఐ టెస్టు, అట్లాగే బ్రెయిన్ కు సంబంధించి కూడా ఎంఆర్ఐ టెస్టు చేయడం జరిగింది.