తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుపై వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం వృత్తివిద్యా కాలేజీ యజమాన్యాల సంఘం (FATHI) చేపట్టిన విద్యాసంస్థల బంద్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరుల సమక్షంలో జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
ప్రస్తుతం కళాశాలలకు పెండింగ్లో ఉన్న టోకెన్ల బకాయిలు రూ.12 వందల కోట్ల వరకు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. వీటిని తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఏ కళాశాలకు ఎంత మొత్తంలో బకాయిలు ఉన్నాయనే వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ అధికారులు ఒక రోజు గడువు కోరారు. దీంతో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రజా భవన్లో మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారు.
Aqua Farmers : ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతున్న ఆక్వా రైతులు
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) నాయకులు ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానంపై ఆధారపడి తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని, లేనిపక్షంలో మంగళవారం నుంచి బంద్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో తరగతులు జరగవని స్పష్టంచేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఫార్మసీ, బీఎడ్ పరీక్షల విషయంలో యాజమాన్యాలు, విశ్వవిద్యాలయాల సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సాయంత్రం జరగబోయే సమావేశం ద్వారా సమస్యకు పరిష్కారం దొరకాలని అందరూ ఎదురుచూస్తున్నారు.