Site icon HashtagU Telugu

Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?

Clay Ganesha idols for the benefit of the environment..Where is the free distribution of idols?

Clay Ganesha idols for the benefit of the environment..Where is the free distribution of idols?

Hyderabad : హైదరాబాద్ నగరంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) భాగస్వామిగా పాల్గొంటున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ప్రాంతీయ సర్కిళ్ల ద్వారా ఈ విగ్రహాలను ఉచితంగా అందిస్తున్నారు. 2017 నుంచి హెచ్‌ఎండీఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏడాది మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం ద్వారా నగరంలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.

ఈ విగ్రహాల పంపిణీ కోసం నగరంలోని అనేక కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రజలు సులభంగా అందుబాటులోకి వచ్చేలా కేంద్రాలు విస్తృతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పంపిణీ కేంద్రాలు ఈ విధంగా ఉన్నాయి. ఉప్పల్ శిల్పారామం, జూబ్లీహిల్స్ సైలెంట్ వ్యాలీ హిల్స్, బంజారాహిల్స్ ఐఏఎస్ క్యార్టర్స్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, హిందూ పత్రిక కార్యాలయం, ఎన్‌టీఆర్ గార్డెన్, ప్రియదర్శిని పార్క్ (సరూర్‌నగర్), రాజీవ్ గాంధీ పార్క్ (వనస్థలిపురం), కుందన్‌బాగ్, బేగంపేట ఐఏఎస్ కాలనీ, దుర్గంచెరువు పార్క్, పాతబస్తీలో వేదిక్ ధర్మ ప్రకాశ్ స్కూల్, గ్రీన్‌ల్యాండ్స్ (బేగంపేట), ప్రెస్ క్లబ్ (సోమాజిగూడ), ఎల్లమ్మ దేవాలయం (బల్కంపేట), టూప్స్ రెస్టారెంట్ (జూబ్లీహిల్స్), పెద్దమ్మ టెంపుల్ (జూబ్లీహిల్స్), మెహిదీపట్నం రైతు బజార్, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, హెచ్‌ఎండీఏ కార్యాలయం (అమీర్‌పేట్), భారతీయ విద్యాభవన్ (సైనిక్‌పురి), వాయుపురి రీక్రేషన్ సెంటర్, సఫిల్‌గూడ పార్కు, మైండ్‌ స్పేస్ & మైహోం నవదీప (మాదాపూర్), తార్నాక కమర్షియల్ కాంప్లెక్స్, ఇందూ అరణ్య (బండ్లగూడ). అలాగే, ప్రజలందరికీ సులభంగా విగ్రహాలు అందించేందుకు కొన్ని ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా కూడా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొబైల్ వ్యాన్లు వెళ్లే ముఖ్యమైన ప్రాంతాలు ఇవే..

.రాంకీ టవర్స్ (మాదాపూర్),

.మలేషియా టౌన్‌షిప్ (కేపీహెచ్‌బీ),

.ఎస్‌ఎంఆర్ వినయ్ (మియాపూర్),

.మైహోం జ్యువెల్ పైప్‌లైన్ రోడ్డు (మియాపూర్),

.ఇందూ పార్చూన్ (కూకట్‌పల్లి),

.వివిధ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు,

.హెచ్‌జీసీఎల్ కార్యాలయం (నానక్‌రాంగూడ).

పర్యావరణ హితంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతుండటాన్ని పరిగణనలోకి తీసుకొని, పర్యావరణానికి మిత్రమైన మట్టి విగ్రహాల వైపు జనాన్ని ప్రోత్సహించడంలో ఈ ఉచిత పంపిణీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజలకు సూచన: విగ్రహాలు ఉచితంగా పొందాలంటే గుర్తింపు కార్డుతో సమీప పంపిణీ కేంద్రాన్ని సందర్శించవచ్చు. మొదటివారే పొందే అవకాశం ఉన్నందున ముందస్తుగా వెళ్లి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకుందాం. మట్టి వినాయకుడితో శుభం కలగాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తున్నాయి.